మనం యేసువలే పరిచర్య చేయాలంటే, యేసువలే ప్రార్థించాలి.
పరిచయం
ప్రార్థన పై సందేశంలో, ప్రొఫెసర్ హోవార్డ్ హెండ్రిక్స్ ఈ ఒప్పించు ప్రకటన చేశాడు:
మీరు బైబిల్ చదివి, ప్రార్థించకపోతే సాతానుడు పెద్దగా పట్టించుకోడు ఎందుకంటే లేఖనం మీ జీవితాన్ని ఎన్నటికి మార్చదు. అది లేఖనాలు బాగా తెలుసనే ఆత్మీయ అతిశయాన్ని ఇస్తుంది.
మీరు విశ్వాసం పంచుకుంటూ, ప్రార్థించకపోతే పెద్దగా పట్టించుకోడు ఎందుకంటే దేవుని గురించి మనుష్యులతో మాట్లాడటం కంటే మనుష్యుల గురించి దేవునితో మాట్లాడటం ముఖ్యమని వాడికి తెలుసు.
మీరు స్థానిక సంఘ పరిచర్యలో పాల్గొంటూ, ప్రార్థించకపోతే సాతానుడు పెద్దగా పట్టించుకోడు ఎందుకంటే మీరు చురుకుగా ఉన్నా పెద్దగా ఏమి సాధించలేరు.[1]
యేసు ఈ లోకంలో చేసిన పరిచర్యలో ప్రార్ధనకు కేంద్రం స్థానం ఉంది. ప్రార్థన కంటే మరేది కూడా ప్రాధాన్యం కాదు. యేసు పరిచర్య పరలోకమందున్న తన తండ్రితో సంబంధంపై స్థిరపడింది. ఆ సంబంధం ప్రార్థన, దేవునితో సన్నిహిత సహవాసం ద్వారా కొనసాగింది.
[2]► ఈ పాఠం అధ్యయనం చేసే ముందు, మీ జీవితం మరియు పరిచర్యలో ప్రార్థనా పాత్రను పరిశీలించండి. ఈ ప్రశ్నలు అడగండి:
నా ప్రార్థన జీవితం స్థిరంగా ఉందా?
ప్రార్థనకు నిర్దిష్టమైన సమాధానం చివరిగా ఎప్పుడు పొందుకున్నాను?
నా ప్రార్థన జీవితంలో గొప్ప సవాళ్లు ఏంటి?
ప్రార్థన జీవితంలో నేను ఎదుగుతున్నానా?
[1]Howard G. Hendricks, “Prayer—the Christian’s Secret Weapon.” Veritas జనవరి 2004 లో మళ్లీ ముద్రించబడింది నుండి తీసుకున్నారు.
యేసు పరిచర్య అంతటా, క్లిష్టమైన పరిస్థితులలో ఆయన ప్రార్థనలో నిమగ్నమవ్వడం మనం చూస్తాం. యేసు ప్రార్థించిన 15 సందర్భాలను సువార్తలు వెల్లడిస్తాయి. ప్రార్థన ఎప్పుడు కూడా రెండవ స్థానంలో ఉండకూడదు; ఆయన జీవితంలో ప్రార్థన ఎల్లప్పుడు కేంద్రంగా ఉండేది.
లూకా ఇతర రచయితలు కంటే ఎక్కువగా, యేసు పరిచర్యలో ప్రార్థనను నొక్కి చెబుతాడు . పన్నెండుమంది శిష్యులను ఎన్నుకునే ముందు రాత్రంతా ప్రార్థించాడని కేవలం లూకా చెబుతాడు (లూకా 6:12). యేసు పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని కొండమీద ప్రార్థించడానికి వెళ్లినప్పుడు రూపాంతరం జరిగిందని కేవలం లూకా చెబుతాడు (లూకా 9:28). ఆది సంఘంలో ప్రార్థన పాత్ర గురించి లూకా 35సార్లు రాసినందున అపొస్తలుల కార్యములులో కూడా ఈ ఉద్ఘాటన కొనసాగుతుంది.
యేసు అనుదిన పరిచర్యలో ప్రార్థన
► మార్కు 1:32-39 చదవండి.
యేసు ఆరంభ పరిచర్యలోని ఈ కథ ప్రార్థన, సేవ ఒకదానికొకటి అనుసంధానమని చూపిస్తుంది. ఈ కథ పురోగతి చూడండి. మునుపటి సాయంత్రం, యేసు ఉంటున్న నివాసం బయట ప్రజలు గుమికూడరు, ఆయన అనేకులను స్వస్థపరిచాడు.
పెందలకడనే, యేసు ప్రార్థించుటకు ఏకాంత ప్రదేశానికి వెళ్లాడు. సీమోను పేతురు ఆయన యొద్దకు వెళ్లి, “అందరు నిన్ను వెదకుచున్నారని చెప్పారు.” అప్పుడు యేసు, “ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.” సేవతో కూడిన ప్రార్థన, యేసు పరిచర్య మాదిరి.
ఇది పరిచర్యకు మాదిరి. ప్రార్థనలేని సేవ ఆత్మీయ అలసటకు దారితీస్తుంది. సేవలేని ప్రార్థనా జీవితం స్వీయ-కేంద్రీకృతం; మన చుట్టుప్రక్కలున్న ప్రజల అవసరాలు తీర్చుటకు మనం ఎటువంటి ప్రయత్నం చేయం. ప్రార్థన మరియు సేవ మిళితమవ్వాలని యేసు చూపించాడు.
నిర్ణయ సమయాల్లో ప్రార్థన
► లూకా 6:12-16 చదవండి
యేసు పరిచర్యలో అతి ముఖ్యమైన ఒక నిర్ణయం, పన్నెండుమంది అపొస్తలులను ఎంపిక చేయడం. ఆయన మాటలు విన్న వేలమందిలో, చాలామంది శిష్యులుగా పిలువబడేంత సమీపస్తులు (యోహాను 6:60, 66). ఆయన అనుచరుల్లో 72మంది బోధనా పరిచర్యలో యేసుకు ప్రాతినిధ్యం వహించేటంత సమీపస్తులు (లూకా 10:1). కాని యేసు, అపొస్తలులుగా పన్నెండు మందిని మాత్రమే ఎంచుకున్నాడు.
పన్నెండుమంది అపొస్తలులు యేసుతో ఎక్కువ సమయం గడిపారు. ఈ లోకంలో ఆయన పరిచర్య ముగింపువరకు ఆయనతో ఉన్నారు. ఆయన ఆరోహణమైన పిమ్మట, పదకొండుమంది అది సంఘంలో నాయకులయ్యారు. పన్నెండుమంది ఎంపిక చాలా కీలకం. యేసు ఏ పుస్తకం రాయలేదు లేక ఏ పాఠశాలను స్థాపించలేదు. సంఘం పట్ల ఆయన దర్శనాన్ని వీళ్ళు నెరవేర్చారు.
పన్నెండుమంది అపొస్తలులను ఎన్నుకునే ముందు యేసు ఏం చేశాడు? ప్రార్థించాడు. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే ముందు, యేసు రాత్రంతా ప్రార్థించాడు. ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే ముందు దేవుని కుమారుడు అంత శ్రద్ధగా ప్రార్థించినప్పుడు, మనం నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ప్రార్థన ఇంకెంత యెక్కువ ప్రధాన పాత్ర పోషించాలి!
శ్రమల సమయంలో ప్రార్థన
► మత్తయి 26:36-46 చదవండి.
ఆయనను బంధించడానికి కొన్ని గంటల ముందు, యేసు ప్రార్థించడానికి గెత్సెమనే తోటకు వెళ్ళాడు. ప్రార్థనతో శ్రమ కొరకు సిద్ధపడ్డాడు. యేసు, మానవుడిగా తనకు ఎదురయ్యే శ్రమలను తప్పించుకోవడానికి ఆయన దైవత్వాన్ని ఎన్నడు ఉపయోగించలేదు. బదులుగా, శ్రమలు ఎదుర్కొనే శక్తి కొరకు ప్రార్థించాడు.
యేసు గెత్సమనే తోటలో చేసిన ప్రార్థన నేడు మనకు మాదిరి. ఆయన ప్రార్థన కల్పితం కాదు. యేసు నిజమైన బాధను భరించాడు. యేసు మానవీయ రీతిలో శ్రమలకు స్పందించాడని తెలుసుకోవడం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందా? శ్రమను ఎదుర్కొంటూ, విశ్రాంతి కొరకు యేసు ప్రార్థించాడు:
ఆయన తోటలో ఇలా ప్రార్థించలేదు: “ఓ, ప్రభువా, నీ పక్షాన బాధననుభవించునట్లు నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు.” లేదు, ఆయన బాధ, భయం, తిరస్కారం, సమీపిస్తున్న నిరాశ అనుభవించాడు. పరిస్థితులెలా కనిపించినప్పటికీ తన తండ్రి విశ్వానికి కేంద్రంగా ఉన్నాడని గ్రహించి, ప్రేమగల దేవునిపై నమ్మకం ఉంచి సహించాడు.[1]
శ్రమ కాలంలో, ఉన్నదానికంటే ఎక్కువ బలంగా ఉన్నట్లు నటించకూడదు. యోబువలే, బాధలో దుఃఖపడొచ్చు. తన మానవ స్వభావంలో, యేసు కూడా అదే చేశాడు! అయితే, మన ప్రేమగల తండ్రి తుది నియంత్రణగలవాడని తెలుసు గనుక యేసువలే నమ్మకంగా ఉండగలం.
ప్రార్థనలోనే తండ్రి చిత్తాన్ని మనం అంగీకరించగలం. తండ్రి చిత్తానికి విధేయత చూపడమే శ్రమ కాలంలో యేసు ప్రార్థనకు, మరియు శ్రమ కాలంలో మన ప్రార్థనకు కీలకం: “అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పెను.”
[1]Philip Yancey, The Jesus I Never Knew. (Grand Rapids: Zondervan, 1995), 161
ప్రార్థనను గురించి యేసు బోధ
ప్రార్థన ప్రాముఖ్యతను యేసు ఆయన మాదిరి ద్వారా చూపడమే కాదుగాని, ఆయన బోధలో కూడా ఎక్కువ సమయం ప్రార్థనకు కేటాయించాడు. యేసు అనుచరుల ఆత్మీయ జీవితం విలువైన ప్రార్థన జీవితంపై ఆధారితమైందని ఆయనకు తెలుసు. ఈ కారణం చేత, ఆయన శిష్యులకు ప్రార్థనపై శిక్షణ ఇచ్చాడు.
కొండమీద ప్రసంగంలో యేసు బోధ
► మత్తయి 6:1-18 చదవండి.
కొండమీద ప్రసంగంలో, ఆత్మీయ కార్యాలకు సంబంధించి మూడు విషయాలు బోధించాడు: బీదలకు ఇవ్వడం, ప్రార్థన, విశ్వాసం. తనను అనుసరించేవారికి ఇవి సాధారణ కార్యకలాపాలుగా భావించాడని ఆయన బోధ ద్వారా స్పష్టమౌతుంది. “మీరు బీదలకు ఇస్తే... లేక “ప్రార్థన చేస్తే.... లేక ఉపవాసం చేస్తే..” అని యేసు చెప్పలేదు. ఆయన అనుచరులు ఉదారంగా, ప్రార్థనపూర్వకంగా, క్రమశిక్షణ కలిగియుండాలని ఆశించాడు.
ఈ సత్క్రియలు చెడు ఉద్దేశ్యాల నుండి పుట్టినట్లయితే అర్థరహితమని చూపించాడు. ప్రాచీన లోకంలో, వేషధారి అంటే నాటకంలో విభిన్న పాత్రలు పోషించడానికి వివిధ ముసుగులు ధరించే నటుడని అర్థం. ఇతరుల ఎదుట “మతపరమైన పాత్ర పోషించటం” సాధ్యం.
మన దాతృత్వంతో ప్రజలను ఆకర్షించడానికి బీదలకు ఇవ్వడం సాధ్యం. యేసు “వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా” చెప్పుచున్నాను అన్నాడు.
సున్నితమైన మన మాటలతో ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రార్థించడం సాధ్యం. యేసు, “వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా” చెప్తున్నాను అన్నాడు.
మన భక్తి, క్రమశిక్షణతో ప్రజలను ఆకర్షించడానికి ఉపవాసం చేయటం సాధ్యం. యేసు, “వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా” చెప్తున్నాను అన్నాడు.
ప్రతి సందర్భంలో, బీదలకు ఇచ్చిన వ్యక్తి, ప్రార్థించిన వ్యక్తి, ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల మెప్పు కొరకు చేశాడు. ప్రజలు ఆకర్షితులయ్యారు; అది అతని బహుమానం. కాబట్టి, దేవుని నుండి ఇక ఎటువంటి బహుమానం పొందడు.
ఈ ఆత్మీయ కార్యకలాపాల ప్రేరణ/ఉద్దేశ్యం మన పరలోకపు తండ్రిని మెప్పించటం. అది బీదలకు ఇవ్వడమైనా, ప్రార్థించడమైనా లేక ఉపవాసం చేయడమైనా, మన బహుమానం దేవుడై ఉండాలి. మనం ఈ ఆత్మీయ కార్యకలాపాలను లోక మెప్పు కోసం చేయకూడదు. బదులుగా, దేవుని పట్ల ఎల్లప్పుడు ప్రగాఢమైన ఆశతో చెయ్యాలి.
యేసు తన శిష్యులకు సరళంగా, సూటిగా ప్రార్థించాలని బోధించాడు:
పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము (మత్తయి 6:9-13).
ఇది మత్తయి 6:7-8లో యేసు ఖండించిన వ్యర్థమైన మాటలవలే బుద్ధిహీనంగా చేసే ప్రార్థన కాదు. బదులుగా, ఇది మన ప్రార్థనలను మార్గనిర్దేశం చేయాల్సిన వైఖరులను సూచిస్తుంది:
సంబంధం
“పరలోకమందున్న మా తండ్రీ” అనే మాట దేవునితో మన సంబంధాన్ని చూపిస్తుంది. దేవుడు, దూరంగా ఉండేవాడుగా కాకుండా, తన పిల్లలకు మంచి యీవులు ఇవ్వటానికి ఇష్టపడే తండ్రిగా గుర్తిస్తాం (మత్తయి 7:11). ఈ పదసమూహం సాన్నిహిత్యాన్ని (“మా తండ్రీ”) అధికారాన్ని (“పరలోకమందున్న”) సూచిస్తుంది. దేవుడు ఘనమైనవాడు అదే విధంగా వ్యక్తిగతమైనవాడు.
గౌరవం
“నీ నామము పరిశుద్ధపరచబడుగాక” - పరలోకమందున్న తండ్రికి, మనకు మధ్య వ్యత్యాసం చూపిస్తుంది. దేవుడు ప్రేమగల తండ్రియైననూ, ఆయన పరిశుద్ధుడు.[1] ప్రసంగి లోని జ్ఞాని నేర్చుకున్నట్లుగా, గౌరవంతోను, భయంతోను దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. (ప్రసంగి 5:2)
లోబడుట
“నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక” ఆయన అధికారానికి మనం ఇష్టపూర్వకంగా లోబడుతున్నామని సూచిస్తుంది. దేవుని చిత్తం పరలోకంలో సంపూర్ణంగా నెరవేర్చబడినందున, భూమి మీద కూడా నెరవేరాలని మనం ప్రార్థించాలి.
ఏర్పాటు
లోకంలో అధిక శాతం ప్రజలు తమ అనుదిన ఆహారం కోసం అనుదినం పనిచెయ్యాలి. “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము”- అనుదినం తండ్రి పై మన నమ్మకాన్ని సూచిస్తుంది. ఆయన పిల్లలుగా, ఆయన మన అవసరాలు తీరుస్తాడని నమ్మాలి.
ఒప్పుకోలు
“మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.” లూకా 11:2-4లో, ఇదే ప్రార్థనలో “మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము” అను పదాలు ఉన్నాయి. మన పాపం, దేవునికి రుణపడి ఉండటం (కొలొస్సయులకు 2:14) కాబట్టి మత్తయి మరియు లూకా రెండింటిలో అర్థం ఒకటే.
ఇతరులను మనం క్షమించడం, దేవుడు మనల్ని క్షమించడంతో అనుసంధానించడం వల్ల, మన క్షమాపణను మనం సంపాదించుకోగలమని యేసు చెప్పలేదు. బదులుగా, క్షమాపణ పొందిన మనం మన యెడల తప్పుచేసిన వారిని ఇష్టపూర్వకంగా క్షమించాలి. క్షమించని దాసుని గూర్చి యేసు చెప్పిన ఉపమానం, మన క్షమాపణ మరియు ఇతరులను క్షమించడానికి మన సుముఖత మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. (మత్తయి 18:21-35).
విజయం
“మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము” అనే మాట శోధన, పరీక్ష పై విజయం కొరకు చేసే ప్రార్థన. దేవుడు ఆయన పిల్లలను ఎప్పుడూ శోధించడు (యాకోబు 1:13), కాని మనందరం శోధన, పరీక్ష సందర్భాలు ఎదుర్కొంటాం (1 పేతురు 1:6-7). ఆ సందర్భాల్లో, సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపనియ్యడు (1 కొరింథీయులకు 10:13).
ధైర్యంతో చేసే ప్రార్థనపై యేసు బోధ
► లూకా 11:1-13 చదవండి.
ప్రభువు ప్రార్థన తర్వాత, ఆయన పిల్లలకు మంచి యీవులు ఇవ్వటానికి ఇష్టపడే ప్రేమగల తండ్రికి ధైర్యంగా ప్రార్థించాలని బోధించే ఉపమానాన్ని లూకా చెప్పాడు. మధ్య తూర్పు ప్రాంతంలో, అతిథి సత్కార్యం చేసేటప్పుడు పొరుగువారి నుండి అప్పు తీసుకోవడం సర్వసాధారణం. ఒకవేళ ఆ వ్యక్తి ధైర్యంగా అడిగితే, పొరుగువాడు అవసరమైన ప్రతిదీ ఇస్తాడు. ఆ సంస్కృతిలో, అభ్యర్ధనకు “లేదు/కాదు” అని చెప్పడం అసభ్యంగా ఉంటుంది. పొరుగువాడు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడకపోయినా సరే, సహాయం కోసం అడిగినప్పుడు తిరస్కరించడు.
మరింత గొప్ప పద్ధతిలో, ధైర్యంగా అడిగే తన పిల్లలకు దేవుడు మంచి యీవులు ఇవ్వాలని ఆశిస్తాడు. ఈ ఉపమానంలో ఆ వ్యక్తి ధైర్యంగా అడిగినట్లే, మనం మన పరలోకపు తండ్రి దగ్గరకు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకు? మన అభ్యర్ధన తిరస్కరిస్తే, దేవుడు అవమానించబడతాడని కాదుగాని అడుగడానికి, వెదకడానికి, తట్టడానికి మనకు అనుమతిచ్చాడు (లూకా 11:9).
[1]“పరిశుద్ధపరచబడును” అంటే “పరిశుద్ధత” లేక “ప్రత్యేకత.”
నిశిత పరిశీలన: హెబ్రీ బోధనా శైలులు
లూకా 11:1-13లో, అతిథి ఆహారం కోసం అప్పు అడగడానికి పొరుగువాడు వచ్చినప్పుడు సహాయం చేయడానికి మంచం కూడా దిగడానికి ఇష్టపడని వ్యక్తి గురించి యేసు ఒక కథ చెప్పాడు.
ఈ ఉపమానం అర్థం చేసుకోవాలంటే, హెబ్రీ బోధనా శైలి అర్థం చేసుకోవాలి - చిన్నవాదన నుండి పెద్ద వాదన. ఈ విధమైన బోధ సెలవిస్తుంది, “ఒకవేళ A (చిన్న వాదన) నిజమైతే, B (పెద్ద వాదన) ఇంకెంత నిజమై ఉండాలి.” ఇప్పుడు మనం ఇలా చెప్పొచ్చు, “ఒక వ్యక్తి ఆకలిగొన్న పరదేశికి భోజనం పెట్టగలిగినప్పుడు (A), ప్రేమగల తండ్రి తన పిల్లలను ఇంకెంత పోషించగలడు (B).”
మీరు ఈ ఉపమానం చదివినప్పుడు, “దేవుడు ఇష్టంలేని ఆ పొరుగువాని వంటివాడు కాబట్టి నా ప్రార్థనలకు జవాబు పొందాలంటే ఆయన్ని ఒప్పించాలని అనుకోవద్దు.” బదులుగా, యేసు అయిష్టత చూపు ఆ మిత్రుడికి, యిష్టపడే పరలోక తండ్రికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తున్నాడు. లోకసంబంధియైన స్నేహితుడు, ధైర్యంగా చేసిన అభ్యర్థనకు స్పందించినప్పుడు, పరలోకపు తండ్రి తన పిల్లలకు ఇంకెంతగా స్పందించగలడు!
ప్రార్థన పై యేసు బోధ (కొనసాగింపు)
ధైర్యంగా చేసే ప్రార్థనను గురించి యేసు బోధ (కొనసాగింపు)
ప్రార్థన అంటే సంబంధం
[1]దేవుడు తన పిల్లల ప్రార్థనకు జవాబివ్వాలనుకున్నప్పుడు, జవాబు ఎందుకు ఆలస్యమౌతుంది? అడుగుడి, వెదకుడి, మరియు తట్టుడి అనే ఆజ్ఞలు వర్తమానకాలంలో ఉన్నాయి. అంటే మనం అడుగుతూ, వెదకుతూ, తట్టుతూ ఉండాలని అర్థమిస్తాయి. ఎందుకు?
ఒక కారణం, ప్రార్థన అంటే విజ్ఞాపనల జాబితా కాదు. ప్రార్థన అంటే మన పరలోకపు తండ్రితో కొనసాగే సంబంధం. “యెడతెగక ప్రార్థనచేయుడి,” (1 థెస్సలొనీకయులకు 5:15) అని పౌలు మనలను ఆజ్ఞాపించినట్లుగా, మనం అడుగుతూ, వెదకుతూ, తట్టుతూ ఉండాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునితో కొనసాగే ఈ సంభాషణ ద్వారా, మన సంబంధం మరింత పెరుగుతుంది. ఇది ప్రార్థన విజ్ఞాపనల జాబితాకు మించింది; ప్రార్థన అంటే సంబంధం.
పట్టుదలతో చేసే ప్రార్థన గురించి ఉపమానం
లూకా 17లో, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు యేసుని అడిగారు. అప్పుడు యేసు, వారు సూచనల కొరకు చూడకూడదని సమాధానమిచ్చాడు. బదులుగా, ఆయన వారితో, “దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది” (లూకా 17:20-21) అని చెప్పాడు. యేసును వెంబడిస్తున్న వారిలో దేవుని రాజ్యం ఉంది.
యేసు ఆ తరువాత శిష్యులను చూసి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. యేసు తక్షణ రాజకీయ రాజ్యం స్థాపిస్తాడని వారు భావించారు, కాని ఆయన మరణం తరువాత కూడా వేచి ఉండాలని యేసు వారిని సిద్ధపరిచాడు. వేచియున్న సమయంలో, వారు విసుకక పట్టుదలతో ప్రార్థించాలి. ఆ తరువాత, యేసు వారికి నమ్మకమైన ప్రార్థన గురించి ఒక కథ చెప్పాడు.
► లూకా 18:1-8 చదవండి.
అనేక ప్రాచీన పట్టణాల్లో, న్యాయాధిపతులు నమ్మకంగా ఉండేవారు కాదు. లంచం తీసుకోకుండా ఒక్కరి కేసు కూడా విచారించేవారు కాదు. ఈ విధవరాలి దగ్గర న్యాయాధిపతికి లంచం ఇచ్చేంత డబ్బు లేదు, కాబట్టి అతడు ఆమె కేసు విచారణ చేయడానికి ఇష్డపడలేదు. చివరిగా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి, “ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని” చెప్పాడు.
ధైర్యవంతుడైన పొరుగువాని ఉపమానం వలే ఈ ఉపమానం కూడా చిన్న వాదన నుండి పెద్ద వాదన బోధనా శైలిని ఉపయోగిస్తుంది. మీరు ఈ ఉపమానం చదివినప్పుడు, ఈ విషయాలు అర్థం చేసుకోవాలి:
[2]దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. మన తండ్రి తాను ఎన్నుకున్నవారికి న్యాయం తీరుస్తాడు.
మనం విధవరాలి వంటి వాళ్ళం కాదు. ఆమె పరదేశి; మనం దేవుని పిల్లలం.
ఆమెకు న్యాయాధిపతి యొద్దకు వెళ్ళే ప్రవేశం లేకపోయింది; యేసు ద్వారా మనం దేవుని యొద్దకు వెళ్లగలం.
ఇది వైరుధ్యాలున్న ఉపమానం. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతియే పట్టుదలతో ఉన్న విధవరాలికు జవాబిచ్చినప్పుడు, మన పరలోకపు తండ్రి తన పిల్లల ప్రార్థనలకు ఇంకెంతగా జవాబిస్తాడు.
వినయంతో కూడిన ప్రార్థనను గురించిన ఉపమానం
► లూకా 18:9-14 చదవండి.
“తామే నీతిమంతులని తమ్మునమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో” యేసు ప్రార్థన గురించి మరొక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం ప్రార్థనలో మనం కలిగి ఉండాల్సిన సరైన వైఖరిని బోధిస్తుంది.
ఉపమానంలో ముఖ్య విషయం ముగింపులో ఉంది: “తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును”. తమ నీతి కారణంగా ప్రార్థనలకు జవాబు వస్తుందని పరిసయ్యులు భావించారు. స్వనీతిపరులు కాని వారి ప్రార్థనలకు దేవుడు ఆయన కృపను బట్టి జవాబిస్తాడని యేసు చూపించాడు. ఏ ఒక్కరు కూడా ప్రార్థనా జవాబు పొందడానికి అర్హులు కారు; అనర్హులైనవారి ప్రార్థనలకు దేవుడు ఆయన కృపను బట్టి జవాబిస్తాడు.
“ప్రార్థన అంటే దేవుని అయిష్టతను జయించడం కాదు. ప్రార్థన అంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవడం.”
- మార్టిన్ లూథర్
అన్వయం: క్రైస్తవుని జీవితంలో ప్రార్థన
కీస్తుని పోలిన వారందరూ ప్రార్థనాపరులు. 19వ శతాబ్దపు లివర్ పూల్ బిషప్, అయిన జే.సి. రైల్, చరిత్ర అంతటిలో గొప్ప క్రైస్తవుల జీవితాలు అధ్యయనం చేసి ఇలా చెప్పాడు. కొందరు ధనికులు, మరొకొందరు దరిద్రులు. కొందరు పండితులు, మరొకొందరు పామరులు. కొందరు కెల్వినిస్టులు; మరికొందరు అర్మీనియన్లు. కొందరు ఆరాధన క్రమం పాటించేవారు; మరికొందరు స్వేచ్ఛాపరులు. “కాని వారందరిలో సాధారణంగా ఒక విషయం ఉంది. వారందరూ ప్రార్థనాపరులు.”[1]
సంఘ చరిత్ర అంతటా, క్రీస్తును పోలిన వారందరూ పార్థనాపరులు. ఒక గొప్ప క్రైస్తవ నాయకుడైన ఇ.యం. బౌండ్స్, ప్రతి ఉదయం 4:00-7:00 వరకు ప్రార్థించేవాడు. అతను “పరిశుద్ధాత్ముడు పద్ధతుల ద్వారా కాదుగాని మనుష్యుల ద్వారా ప్రవహించాడు. ఆయన యంత్రాలపైకి కాదుగాని మనుష్యుల పైకి వచ్చాడు. ఆయన ప్రణాళికలను కాదుగాని మనుష్యులను ప్రార్థనాపరులైన మనుష్యులను అభిషేకించాడు” అని రాశాడు.[2]
జార్జ్ ముల్లర్ వేలాదిమంది పిల్లలకు అనాథాశ్రమాలు పెట్టాడు. మానవుల సహాయం కోరక ప్రార్థనపైనే ఆధారపడాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ప్రార్థన ద్వారా $7,000,000 పొందుకున్నాడు. అతడు అనాథాశ్రమాలకు సహకారం ఇవ్వడమే కాకుండా, ఇతర పరిచర్యలకు కూడా వేలాది డాలర్లు ఇచ్చాడు. ప్రార్థన శక్తి జార్జ్ ముల్లర్ కు తెలుసు.
ఆయన మానవత్వంలో, యేసు తన తండ్రితో మాట్లాడడానికి ప్రార్థనపై ఆధారపడ్డాడు. ప్రార్థన దేవునిపై ఆధారపడే చర్య. మనం మనపై ఆధారపడక దేవునిపై ఆధారపడుతున్నామని ఇది చూపిస్తుంది.
► మత్తయి 26:31-46 చదవండి.
సీమోను పేతురు పతనం, ప్రార్థన ప్రాముఖ్యత చూపిస్తుంది. “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు” అని యేసు ఆయన శిష్యులను హెచ్చరించాడు. మరింత సూటిగా, “సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను” (లూకా 22:31) అని చెప్తూ పేతురును హెచ్చరించాడు. పేతురు రెండు కారణాల వల్ల పతనమయ్యాడు.
1. పేతురు మితిమీరిన ఆత్మవిశ్వాసం గలవాడు. అతను “అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా…. చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను” (మత్తయి 26:33, 35) అని చెప్పాడు. అహం పేతురుకు తనపై తాను ఆధారపడే అపార నమ్మకం కలిగించింది.
[4]2. పేతురు ప్రార్థనలో విఫలమయ్యాడు. తన సొంత బలాన్ని నమ్ముకున్నాడు, దేవునిపై ఆధారపడలేదు. యేసుతో కలిసి ప్రార్థించకుండా, పేతురు నిద్రపోయాడు. మనం దేవునిపై సంపూర్ణంగా ఆధారపడాలని గ్రహించినప్పుడే అత్యాశక్తితో ప్రార్థించగలం. డిక్ ఈస్ట్మెన్ “కేవలం ప్రార్థనలోనే మనం మన సమస్యలు దేవునికి అప్పగిస్తాం”[5] అని రాశాడు,
దేవుని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రార్థిస్తాం.
అధునిక సంఘంలో ఉన్న ఒక గొప్ప బలహీనత ఏంటంటే, దేవుని గూర్చి పూర్తి అవగాహన లేకపోవడం. చాలాసార్లు, మన ప్రార్థన భౌతికపరమైన అవసరాల జాబితా మరియు వ్యక్తిగత విషయాలను మాత్రమే కలిగి ఉంటుంది. చాలామంది, “దేవా, మా పిల్లలను నీ పోలికెలో మార్చండి” అని కాకుండా, “మా పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చేట్లు సహాయం చెయ్యండి” అని ప్రార్థిస్తారు. మనం ఎక్కువగా ఆత్మీయ స్వస్థత కోసం కాకుండా భౌతిక స్వస్థత కోసం ప్రార్థిస్తాం. ప్రార్థన అవగాహన మనకెంత తక్కువగా ఉందో ఇది చూపిస్తుంది.
ప్రార్థన యొక్క ఒక ప్రాథమిక ఉద్దేశ్యం, దేవుని పూర్తిగా తెలుసుకోవడం. ప్రార్థనలో, దేవుని హృదయానికి అనుగుణంగా ఉంటాం. ప్రార్థన అంటే మనకు కావలసింది దేవునిని అడిగి పొందుకోవడం కాదు. ప్రార్థన అనేది దేవుని హృదయాన్ని మనకు తెలియజేసే జ్ఞానం ఇస్తుంది, మనం ఆయన కోరుకున్నదే కోరుకునే వరకు.
మనం ఈ సమయానికి వచ్చేసరికి, “అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను” (మార్కు 11:24) అని యేసు చెప్పాడు. మన హృదయం దేవుని హృదయానికి అనుగుణంగా ఉన్నప్పుడు, మనం దురాశలతో లేక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడగము (యాకోబు 4:3 మరియు 1 యోహాను 5:14). దేవుని హృదయం గూర్చిన ఈ అవగాహన పట్టుదల ప్రార్థన ద్వారా వస్తుంది.
మనం “ప్రార్థించేవరకు ప్రార్థించాలి” అని ప్యూరిటన్లు చెప్పారు. మరోమాటల్లో, మనం అర్థం లేని మాటలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి ప్రవేశించేవరకు సుదీర్ఘంగా, సహనంగా ప్రార్థించాలి. దేవునిలో ఆనందించేవరకు ప్రార్థించాలి.
► ప్రార్థన మీకు దేవుని గూర్చి, ఆయన చిత్తం గూర్చి లోతైన జ్ఞానం ఇచ్చిన సందర్భం గురించి చెప్పండి.
మనం ఎలా ప్రార్థిస్తాం?
ప్రార్థన విషయంలో యేసు మాదిరిని అధ్యయనం చేయడం ద్వారా, ప్రభావవంతమైన ప్రార్థన గురించి ముఖ్య పాఠాలు మనం నేర్చుకుంటాం.
సహనంతో ప్రార్థిస్తాం
యేసు దేవుని కుమారుడు. అతని ప్రార్థన జీవితం, “తండ్రీ, నేను ఏమి చేయాలనుకుంటున్నావు?” అని చెప్పే ఒక సాధారణ విషయం అని ఎవరైనా అనుకోవచ్చు. మరియు తక్షణ సమాధానాన్ని పొందుతుంది! దానికి బదులుగా, పన్నెండు మంది అపొస్తలులను ఎన్నుకునే ముందు యేసు రాత్రంతా ప్రార్థనలో గడపడం మనం చూస్తాం. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థనలో పోరాడాడు. యేసుకు కూడా ప్రార్థన విషయంలో ఓర్పు, సమయం అవసరం. ప్రార్థన అంటే దేవుని కోసం వేచి ఉండడం.
ప్రార్థనలో, వేచివుండాల్సిన ప్రాముఖ్యత గురించి రాస్తూ, గ్లెన్ పేటర్సన్ ఇలా చెప్పాడు, “మనం వేచివుండగా దేని కొరకు వేచివున్నామనే దానికంటే, దేవుడు మనలో ఏం చేస్తున్నాడనేది చాలా ముఖ్యం. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో అలా మనల్ని సిద్ధపరిచే ప్రక్రియలో, వేచివుండడం ఒక భాగం.” దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయన్ని మరింత ఎక్కువ అర్థం చేసుకుంటాం.
కీర్తన 37:1-9 ప్రార్థన గురించి ముఖ్యమైన పాఠాలు బోధిస్తుంది. ఈ ఆజ్ఞలు చూడండి:
వ్యసనపడకూడదు
యెహోవాయందు నమ్మకం ఉంచాలి
యెహోవానుబట్టి సంతోషించాలి.
నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించాలి.
ఆయన్ని నమ్ముకోవాలి.
యెహోవా యెదుట మౌనంగా ఉండాలి.
ఆయన కొరకు కనిపెట్టుకోవాలి.
కోపాన్ని మానాలి.
వ్యసనపడకూడదు (మళ్లీ!)
నీ హృదయవాంఛలను తీర్చే దేవునియందు నమ్మకముంచాలని ఈ ఆజ్ఞ చెబుతుంది (కీర్తన 37:4). పట్టుదల ప్రార్థన ద్వారా, మనం దేవుడు ఆశించే, నమ్మకస్తులైన ప్రజలుగా మారతాం.
తన క్రైస్తవ జీవిత ఆరంభంలో, జార్జ్ ముల్లర్ తన ఐదుగురు స్నేహితులు మారాలని ప్రార్థించాడు. చాలా నెలలు గడిచిన తరువాత, ఒకరు ప్రభువును నమ్ముకున్నారు. పది సంవత్సరాలు తరువాత, ఇద్దరు మారారు. నాలుగవ వ్యక్తి మారటానికి 25 సంవత్సరాలు పట్టింది.
తన ఐదవ మిత్రుని కొరకు ముల్లర్ చనిపోయేవరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. 52 సంవత్సరాలు, తన స్నేహితుడు క్రీస్తునంగీకరించాలని ప్రార్థిస్తూనే ఉన్నాడు! ముల్లర్ చనిపోయిన కొన్ని రోజులకు, ఐదవ వ్యక్తి రక్షించబడ్డాడు. ముల్లర్ పట్టుదల కలిగిన ప్రార్థనను నమ్మాడు.
వినయంతో ప్రార్థిస్తాం.
“అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని” (లూకా 22:42) యేసు ప్రార్థించాడు. తండ్రి పరిపూర్ణ చిత్తాన్ని నమ్మొచ్చని యేసుకు తెలుసు.
ప్రార్థన అనేది వినయంతో కూడిన చర్య. మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తాం ఎందుకంటే మన జ్ఞానంతో వారికి సహాయం చేయలేము; దేవునిపై ఆధారపడాలి. మనం మన కొరకు ప్రార్థించుకుంటాం ఎందుకంటే మన శక్తితో జీవితం గడపలేము; దేవునిపై ఆధారపడాలి.
ప్రార్థన దేవుని సహాయం మనకు అవసరమని గుర్తుచేస్తుంది. మన సమస్యలను మన సామర్థ్యంతో పరిష్కరించగలమని భావించినప్పుడు, హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించలేము. మన స్వంత శక్తితో జీవితపు సమస్యలను పరిష్కరించలేమని గ్రహించినప్పుడు, వినయంతో దేవునికి ప్రార్థన చేస్తాం.
మన ప్రార్థన నమ్మకంతో కూడిన వినయంతో చేయబడాలి. జవాబుకోసం దేవునిపై నిరీక్షించినప్పుడు, తన పిల్లలను ప్రేమించి, వారికి ఉత్తమమైనదే అనుకొనే పరలోకపు తండ్రికి మనం ప్రార్థిస్తున్నందువల్ల, మనకు నిశ్చయత మరియు సమాధానం లభిస్తాయి. జీవితంలోని మరియు పరిచర్యలోని ఒత్తిడులలో, వినయపూర్వకమైన ప్రార్థన మనకు దేవునిపై నిశ్శబ్ద నమ్మకాన్ని ఇస్తుంది.
వ్యక్తిగతంగా ప్రార్థిస్తాం.
దేవునిని “మా తండ్రీ” అని వ్యక్తిగతంగా సంబోధించటం ద్వారా ప్రార్థన మొదలుపెట్టాలని యేసు శిష్యులకు బోధించాడు. నిజమైన ప్రార్థన వ్యక్తిగతమైంది. పాల్ మిల్లర్ ఇలా రాశాడు: “చాలామంది దేవునిపై కాకుండా ప్రార్థనపై మనసు పెడతారు గనుక ఎలా ప్రార్థించాలా అని ఇబ్బంది పడుతూ ఉంటారు.”[7] చాలాసార్లు, దేవునితో మాట్లాడకుండా “ప్రార్థనలు పలుకుతూ” ఉంటాం. “వ్యర్థమైన మాటలు” పలుకకుండా ఉండాలనేది యేసు హెచ్చరికల్లో ప్రధానం (మత్తయి 6:7).
కంఠస్థం చేసిన మాటలతో విందు బల్ల వద్దకు వచ్చిన వ్యక్తి గురించి ఆలోచన చేయండి. అతడు “మన కుటుంబంతో నేను కొంచెం మాట్లాడాలి, కాబట్టి నేను కొన్ని మాటలు కంఠస్థం చేశాను” అని చెప్తాడు. ఇది నిజమైన సంభాషణ కాలేదు! అతను బల్ల దగ్గర కూర్చున్న వ్యక్తులపై శ్రద్ధపెట్టాలనుకుంటాం కాని మాటలపై కాదు.
మనం లేదా ఇతరులు రాసిన ప్రార్థనలు, ప్రార్థించాల్సిన విషయాలను గుర్తుచేసుకోవడానికి సహాయపడతాయి, కానీ ప్రార్థన అంటే ఎంపిక చేసుకున్న మాటలపై కాదుగాని దేవునిపై దృష్టిపెడుతుంది. ప్రార్థన వ్యవస్థ కాదు; ప్రార్థన ఒక సంబంధం. ప్రార్థన వ్యక్తిగతమైంది.
మనం ప్రార్థనాపరులుగా ఎలా అవుతాం?
ఐదవ శతాబ్దంలో, రోమాకు చెందిన గొప్ప వ్యక్తి, అనిసియా ఫాల్టోనియా ప్రోబా, ప్రార్థనపై సలహా ఇవ్వాలని అగస్టీన్ ని అడిగింది. ప్రార్థనాపరురాలిగా ఎలా అవ్వాలో ప్రోబ తెలుసుకోవాలనుకుంది. ప్రార్థనపై ఒక తెలివైన సలహాతో అగస్టీన్ పెద్ద లేఖ రాశాడు.[8] ఈ భాగంలో, ప్రార్థనను గురించి అగస్టీన్ చెప్పిన సూత్రాలు పరిశీలిస్తాం.
ఎలాంటి వ్యక్తి ప్రార్థించే వ్యక్తిగా మారగలడు?
మొదటిగా, ప్రార్థించే వ్యక్తి ఇతర ఏ వనరులు లేనివాడై ఉండాలని అగస్టీన్ చెప్పాడు. ప్రార్థించే వ్యక్తి కేవలం ప్రార్థనపై ఆధారపడాలి.
ప్రోబ రోమ్లో అత్యంత శక్తివంతమైన, ధనవంతురాలైన ఒక విధవరాలు. ఆమె ముగ్గురు కుమారులు రోమా రాయబారులుగా పనిచేశారు. అగస్టీన్, ప్రోబకి ఇలా చెప్పాడు: “ఈ లోకంలో తాను ఒంటరి వ్యక్తిగా భావించాలి.” ఎంత ధనవంతురాలైన, శక్తివంతురాలైన లేక విజయం సాధించినా, దేవుని యెదుట మన నిస్సహాయత గుర్తించాలి. అలా చేయకపోతే, మన ప్రార్థనలు సుంకరి ప్రార్థనలవలే కాక పరిసయ్యుడి ప్రార్థనలవలే ఉంటాయి.
దేని కొరకు ప్రార్థించాలి?
అగస్టీన్, ప్రోబకు ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు: “సంతోషకరమైన జీవితం కోసం ప్రార్థించు” అని చెప్పాడు. ఇది స్వార్థంగా అనిపించొచ్చు, కాని నిజమైన సంతోషం కేవలం దేవుని నుండి వస్తుందని అగస్టీన్ వివరించాడు. “కావాలనుకున్నవన్నీ కలిగియుండి, వద్దనుకున్నవాటిని పొందకుండా ఉన్న వ్యక్తి నిజంగా సంతోషం”గా ఉంటాడు.
క్రైస్తవుడు సంతోషంగా ఉంటాడు ఎందుకంటే అతనికి దేవుడున్నాడు, దేవుడు కోరనిది ఏదియు కలిగియుండడు. కీర్తనాకారునివలే, మనం దేవుని సన్నిధితో సంతృప్తిగా ఉంటాం.
యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవామందిరములో నివసింపగోరుచున్నాను (కీర్తన 27:4).
మనం అన్నిటికంటే ఎక్కువగా దేవుని సన్నిధిని నిజంగా కోరితే, దేవుడు తనను తాను మనకు అప్పగించడం ద్వారా మన లోతైన కోరికను తృప్తిపరుస్తాడని తెలుసుకొని సంతోషం కొరకు ప్రార్థించవచ్చు!
కష్టసమయాల్లో ఎలా ప్రార్థించాలి?
“ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు” (రోమా 8:26) అని పౌలు చెప్పిన సందర్భాలు ఉంటాయని అగస్టీన్ ప్రోబకు గుర్తుచేశాడు. నిస్సహాయ సందర్భాల్లో మనం ఎలా ప్రార్థించాలి?
అగస్టీన్ మూడు లేఖనాలు చూశాడు. మొదటిగా, “శరీరములో ఒకముల్లు” నుండి విడుదల పొందడానికి ప్రార్థించినప్పుడు అతడు పౌలు ఉదాహరణను సూచించాడు. విడుదలకు బదులుగా, “నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది” అని దేవుడు వాగ్దానం చేశాడు. “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను….నేను సంతోషించుచున్నాను” (2 కొరింథీయులకు 12:8-10) అని పౌలు సాక్ష్యమిచ్చాడు.
రెండవదిగా, అగస్టీన్ యేసు గెత్సెమనే ఉదాహరణ సూచించాడు. యేసు ఆశలు దేవునికి అప్పగించుకున్నాడు. యేసు విడుదల కొరకు ప్రార్థించాడు: “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము.” కాని ఇలా ముగించాడు, “అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను” (మత్తయి 26:39).
చివరిగా, అగస్టీన్ రోమా 8:26 సూచించాడు. ప్రార్థన ఎలా చెయ్యాలో మనకు తెలియనప్పుడు, పరిశుద్ధాత్ముడు మన హృదయాలను నడిపిస్తాడు. ఆత్మ మన బలహీనతో సహాయం చేస్తాడు, ఉచ్చరింపశక్యముకాని మూలుగుతో విజ్ఞాపన చేస్తాడు. మనం మాటలకు మించిన స్థితిలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలను, తండ్రి యొద్దకు చేర్చుతాడు, అప్పుడాయన సంకల్పం చొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తం సమకూడి జరుగేలా చేస్తాడు (రోమా 8:26-28).
[1]Matt Friedeman, The Accountability Connection. (Wheaton, Illinois: Victor Books, 1992), 37 లో ఉటంకించారు.
[2]Edward M. Bounds, Power Through Prayer. (Kenosha, Wisconsin: Treasures Media, n.d.), 2
“మనుష్యులు మన అభ్యర్థనలు, మన సందేశాలు, తిరస్కరించవచ్చు, మన వాదనలు వ్యతిరేకించొచ్చు, వ్యక్తులను త్రుణీకరించవచ్చు; కాని మన ప్రార్థనలకు నిస్సహాయులు”
- జె. సిడ్లో బాక్స్టర్
[7]Paul E. Miller, A Praying Life: Connecting with God in a Distracting World. (Colorado Springs: NavPress, 2009)
[8]Philip Schaff, ed. The Confessions and Letters of St. Augustine: Nicene and Post-Nicene Fathers, First Series, Volume 1. (Buffalo, New York: Christian Literature Publishing Company, 1886), 459-469
ముగింపు: ప్రార్థన ఎలా చెయ్యాలో తెలియనప్పుడు
కొన్నిసార్లు మనం చేయగలిగినది మౌనంగా ఉండటం.[1] ప్రార్థించాలనుకుంటారు, కాని ఎలా ప్రార్థించాలో తెలీదు; ప్రార్థించడం రాదు. అప్పుడేం చేస్తారు? క్రీస్తు, మన ప్రధాన యాజకుడని గ్రహించడం కీలకమైన విషయం.
ఇవాంజెలికల్ క్రైస్తవులుగా, విశ్వాసులందరు యాజకులని నమ్ముతాం. ఈ గొప్ప సంస్కరణ సిద్ధాంతం, ప్రతి ఒక్కరికి తండ్రి యొద్దకు ప్రవేశం ఉందని బోధిస్తుంది. అయితే, అపార్థం చేసుకుంటే, ఈ సిద్ధాంతం ఆత్మీయ పోరాటానికి నడిపిస్తుంది. “సరిగా ప్రార్థించానా? నేను చేయాల్సిన పని చేశానా?” లాంటి అనుమానాలతో నిండిపోతాం:
2013లో ఒక సమావేశంలో, ఈ ప్రశ్నలతో సతమౌతున్నానని చెప్పి ప్రొఫెసర్ అలాన్ టోరన్స్ ఈ సాక్ష్యం చెప్పాడు.
జనవరి 2008లో, నా భార్య జేన్ క్యాన్సర్ తో చనిపోయింది. ఆమె ఒక మంచి క్రైస్తవ స్త్రీ, భార్య, తల్లి. క్యాన్సర్ శరీరమంతా పాకిపోయి చనిపోవడం, ఆమె బాధ పిల్లలు కూడా చూస్తూ ఉండటం నాకు చాలా కష్టంగా అనిపించింది. కొన్నిసార్లు, నా దుఖంలో ఎలా ప్రార్థించాలో, ఏమి ప్రార్థించాలో కూడా అర్థం కాలేదు. ఎలా ప్రార్థించాలో నాకు తెలీదు.
ఆ సమయంలో, క్రీస్తు యాజకత్వం మరింత సంబంధించినదిగా ఉంటుంది. జేన్ ను నా చేతుల్లో పట్టుకున్నాను, ఆరోహణమైన యాజకుడు (యేసు క్రీస్తు) మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మనమాయన సన్నిధిలో విశ్రమించగలం.
ఆ సమయంలో నేను పట్టున పెట్టుకున్న ప్రార్థన ప్రభువుతో నేర్పిన ప్రార్థనే. నేను నా సొంతంగా ప్రార్థన చేయలేకుండా ఉండాను. “పరలోకమందున్న నా తండ్రీ—నేను ఉన్న చోటుకు దూరంగా ఉన్నవాడా.” అనడం బదులుగా, పరిశుద్ధాత్మ ద్వారా నేను “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక” అని ప్రార్థించాను.
క్రీస్తు నిరంతర యాజకత్వ ప్రాముఖ్యత కనుగొనడమంటే, మన జీవితంలో ప్రతి భాగాన్ని, ఆరాధనను మార్చే సువార్తను కనుగొనటం.
మన వ్యక్తిగత ఆత్మీయ శక్తి ద్వారా తండ్రిని చేరుకోవాలనే విధంగా ఆలోచన చేస్తే విశ్వాసులందరి యాజకత్వాన్ని మనం అపార్థం చేసుకుంటాం. అది తప్పు. విశ్వాసులందరు యాజకులనే ఆలోచన, క్రీస్తు తప్పా మరో మధ్యవర్తి అవసరత లేదని నొక్కి చెబుతుంది. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థనలో విఫలమైన మన ప్రయత్నాలను అంగీకరించి, వాటిని ఆమోదయోగ్యమైన బలులుగా తండ్రికి అప్పగిస్తాడు. మన ప్రార్థన ఆత్మ ద్వారా, మన ప్రధానయాజకుడు యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా బలపడుతుంది.
ప్రార్థన ఎలా చెయ్యాలో తెలియనప్పుడు, నిరాశపడొద్దు. మన ప్రక్కన మోకరించి, మనం చెప్పలేని వాటిని చెబుతూ తండ్రికి విజ్ఞాపన చేసే వ్యక్తి మనకు ఉన్నాడు.
[1]Marc Cortez, Everyday Theology నుండి ఈ భాగం తీసుకున్నారు.
పాఠం 2 అభ్యాసాలు
(1) బైబిల్ పదకోశం లేదా బైబిల్ అన్వేషణ వెబ్ సైట్/ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి, బైబిల్లో ప్రార్థన గురించి మూడు ఉదాహరణలు కనుగొనండి. ప్రతి ప్రార్థనను పరలోక ప్రార్థనతో పోల్చండి. ఇతర బైబిల్ ప్రార్థనల్లో ఏ విషయాలు పరలోక ప్రార్థనలో కనిపిస్తాయి? మీరు చూసిన దానిని నమోదు చేయడానికి తరువాత పేజిలో పట్టికను ఉపయోగించండి.
(2) ఒక నెలపాటు ప్రార్థన పత్రిక కలిగియుండండి. ప్రార్థనలో మీ నిరాశలు, ప్రార్థనలో మీ జయాలు, ప్రార్థనకు దేవుడు ఇచ్చిన సమాధానాలు రాయండి. మీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ పత్రికను ఉపయోగించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.