రక్షణకు నడిపించే కృప (The Grace That Leads to Salvation)
బలిని అర్పించినప్పటికీ, తన హృదయంలో దేవుని కృప పనిచేయకపోతే పాపి నిరాశలోనే ఉంటాడు. పాపియైన వ్యక్తి, సాతాను అధికారం క్రింద జీవిస్తూనే, చెడు కోరికలతో నియంత్రించబడుతూ, పాపంలో ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటాడు (ఎఫెసీయులకు 2:1-3). అతను తన ప్రవర్తనను మార్చుకోవడానికి శక్తి లేనివాడు (రోమా 7:18-19). అలాంటి వ్యక్తి పశ్చాత్తాపంతోను, విశ్వాసంతోను సువార్తకు ఎలా ప్రతిస్పందిస్తాడు?
దైవజ్ఞాన పండితులు, మనిషి స్థితికి, దేవుని కృప ఎలా స్పందించిందో వివరించే ప్రయత్నం చేశారు.
జాన్ కాల్విన్
మనిషి సంపూర్ణ భ్రష్టత్వానికి లోనయ్యాడు గనుక దేవునికి స్పందించాలనే ఎంపికను చేసుకోలేడని/నిర్ణయం తీసుకోలేడని జాన్ కాల్విన్ నమ్మాడు.[1] కాబట్టి, ఎవరు రక్షణ పొందుతారో, ఎవరు రక్షణ పొందరో దేవుడే ఎంపిక చేస్తాడు/నిర్ణయిస్తాడు. దేవుడు రక్షణ పొందడానికి కొంతమందిని మాత్రమే ఎంపిక చేసుకొన్నాడు గనుక ప్రాయశ్చిత్తం వారికొరకే అందించబడింది కానీ ప్రజలందరికీ కాదు. ఈ వ్యక్తులు ఎంపిక చేసుకోలేరు. ఎదురాడలేని/నిరోధించలేని కృపతో, వాళ్ళు పశ్చాత్తాపపడి, విశ్వాసముంచేలా దేవుడు చేస్తాడు. వారి చిత్తం దేవుని నియంత్రణ క్రింద ఉంది కనుక వాళ్ళు రక్షణ నుండి ఎప్పటికీ తొలగిపోరు. ఇది దేవుని సార్వభౌమాధికారం గురించి కాల్విన్ భావన.
రక్షణార్థమైన కృప ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని కాల్విన్ నమ్మలేదు. ప్రత్యేకమైన కృప లేకుండా ఏ వ్యక్తి పశ్చాత్తాపపడలేడు, నమ్మకముంచలేడు అని అతను నమ్మాడు మరియు ఈ కృప అనేకమందికి ఇవ్వబడలేదని నమ్మాడు.
ఒక వ్యక్తి దేవుని నుండి సహాయం పొందకుండా ప్రమాణాన్ని/వాగ్దానాన్ని నెరవేర్చడం లేదా తన కుటుంబాన్ని ప్రేమించడం లాంటి మంచి పనులు చేయలేడని కెల్విన్ నమ్మాడు. సత్క్రియలు చేయు సామర్థ్యం ఇచ్చే కృపను దేవుడు ప్రజలందరికీ ఇచ్చాడు అని అతడు నమ్మాడు. అతను దీనిని “సాధారణమైన కృప” అని పిలిచాడు. సాధారణ కృప ఒక వ్యక్తిని రక్షణలోనికి తీసుకురాగలదని అతను నమ్మలేదు.
జాన్ వెస్లీ దేవుని కృపను గురించి ఒక భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్, దేవునికి స్పందించడానికి ప్రజలను నిరంతరం పిలవడం అతను చూశాడు. దీన్ని బట్టి, మనిషి ఎంపిక/నిర్ణయం వాస్తవమైనదని నమ్మాడు. కాల్విన్ వలె, మనిషి భ్రష్టుడైపోయాడని, దేవుని నుండి సహాయం లేకుండా సువార్తకు స్పందించలేడని, కానీ దేవుడు ఆ సహాయాన్ని ప్రతి ఒక్కరికీ ఇస్తాడని నమ్మాడు. దేవుడు స్పందించాలనే కోరికను, స్పందించడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు, కానీ అనివార్యంగా వారిని రక్షించడు. దేవుడు మనిషి ఎంపికను సాధ్యం చేశాడు. ఇది ప్రతి వ్యక్తి యొద్దకు వచ్చిన మొదటి కృప. దైవజ్ఞాన పండితులు దీనిని, “ముందస్తు కృప/పూర్వకృప” అని పిలుస్తారు, “ముందుగా వచ్చే కృప” అని దీనర్థం.
దేవుని కృప, పాపి హృదయంలోనికి చేరి, తన పాపాలను ఒప్పింపజేసి, దేవునినుండి దూరమవ్వడానికి తనకు తానే కారణమని చూపిస్తుంది. దేవుని కృప, ఆ వ్యక్తి క్షమాపణను కోరుకునేలా చేస్తుంది మరియు దేవునికి స్పందించగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది.
కృప లేకుండా ఏ వ్యక్తి కూడా కనీసం దేవుని యొద్దకు రాలేడు. కృప పొందుటకు అర్హత సంపాదించడానికి అతను ఏం చేయకపోయినప్పటికిని, దేవునిని వెదకడం ప్రారంభించడానికి ముందే కృప ప్రతి వ్యక్తి దగ్గరకు వస్తుంది.
ఎఫెసీయులకు 2:1-3 వచనాలు, ఎంతటి నిస్సహాయమైనస్థితిని గురించిన వివరణనిస్తాయో జ్ఞాపకం చేసుకోండి? కానీ ఆ వివరణ తరువాత వచ్చే రెండు వచనాలను చూడండి.
“అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు.” (ఎఫెసీయులకు 2:4-5).
ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే, అతనికి కృప అందుబాటులో లేనందువల్ల కాదు, కానీ అతనికి అందుబాటులో ఉన్న కృపకు స్పందించకపోవడం ముఖ్య కారణం.
► మనిషి దేవుని కొరకు వెదకడం లేదా మనిషి అంతరంగంలో దేవుడు పనిచేయడం - వీటిలో ఏది మొదటిగా వస్తుంది? దీన్ని మీరు ఎలా వివరిస్తారు?